కేసీఆర్ రద్దైన వెయ్యి రూపాయల నోటు లాంటి వారు : సీఎం రేవంత్

కేసీఆర్ పొలం బాట పట్టడం సంతోషం.. పదేళ్ల తరువాత తెలంగాణ రైతులున్నారని కేసీఆర్ కు గుర్తొచ్చినందుకు సంతోషం అని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు

By Medi Samrat  Published on  2 April 2024 10:54 AM GMT
కేసీఆర్ రద్దైన వెయ్యి రూపాయల నోటు లాంటి వారు : సీఎం రేవంత్

కేసీఆర్ పొలం బాట పట్టడం సంతోషం.. పదేళ్ల తరువాత తెలంగాణ రైతులున్నారని కేసీఆర్ కు గుర్తొచ్చినందుకు సంతోషం అని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారం పోకుండా ఉండి ఉంటే.. కిందపడి గాయం కాకుండా ఉంటే.. కూతురు జైలుకు వెళ్లకపోయి ఉంటే ఆయన ఎవరికీ దొరికే వారు కాదని అన్నారు కాంగ్రెస్ వచ్చింది.. కరువు వచ్చింది అని కేసీఆర్ అంటుండు.. మేం అధికారంలోకి వచ్చిందే చలి కాలంలో.. వర్షాకాలంలో అధికారంలో ఉన్నది వాళ్లేన‌న్నారు.

కేసీఆర్ పాపాలకు వరుణ దేవుడు కూడా భయపడి పారిపోయాడన్నారు. కేసీఆర్.. నువ్వు చేసిన పాపాలను మాపై రుద్దాలని చూడొద్దని సూచించారు. మీ పాలనలో 20 రోజులు వానలు పడకపోవడం వల్లే 24లో కరువు వచ్చిందన్నారు. 64లక్షల 75 వేల 581 మంది రైతు ఖాతాల్లో మా ప్రభుత్వం రైతు బంధు వేసిందని.. ఇంకా మిగిలింది 4 లక్షల ఖాతాలు మాత్రమేన‌న్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా రైతులకు రైతు బంధు చెల్లిస్తామ‌న్నారు.

మేం చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమ‌న్నారు. మేం చెప్పిన లెక్కలు వాస్తవమైతే తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ పర్యటించిన రోజు సూర్యాపేటలో 30 సెకన్లు కూడా కరెంటు పోలేదన్నారు. సూర్యాపేట ప్రెస్ మీట్ లో కేసీఆర్ మైక్ జనరేటర్ కు కనెక్ట్ అయి ఉంది.. నీ జనరేటర్ లో ఎవడు పుల్ల పెట్టాడో ఎవరికి తెలుసని ఎద్దేవా చేశారు.

మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి.. ఆ పాపపు సొమ్ము నుంచి 100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే నీవు చేసిన పాపం కొంతైనా తగ్గేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేసీఆర్ నక్కజిత్తుల వేషాలన్నారు. పొగ పెట్టగానే కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చినట్లు.. ఎన్నికలు అనే పొగ పెట్టడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడన్నారు. ఆడబిడ్డల కళ్లలో సంతోషం చూసి కేసీఆర్ నిప్పులు పోసుకుంటున్నారు.. కేసీఆర్ పర్యటన చూస్తోంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్ధ యాత్రలకు వెళ్లినట్లుందని అన్నారు. కేసీఆర్ రద్దైన వెయ్యి రూపాయల నోటు లాంటి వారని అన్నారు. ప్రతీ వారం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నేరవేర్చాలన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. జూన్ 9న ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది. రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహ్వానితులేన‌న్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నావని కేసీఆర్ అంటుండు.. రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనో.. సినిమా వాళ్ల గెస్ట్ హౌసుల్లోనో పడుకోవడంలేదని కేసీఆర్ గ్రహించాలన్నారు. కేసీఆర్ , కేటీఆర్ వాళ్ల బాస్ మోదీ గెలవాలని.. కాంగ్రెస్ కు 40 రావాలని కోరుకుంటున్నారు.. కేసీఆర్ కు 48 గంటల సమయం ఇస్తున్నా.. చనిపోయిన 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వండి.. నిజంగా రైతులు చనిపోయి ఉంటే వారిని ఆదుకునే బాధ్యత మాది అని స్ప‌ష్టం చేశారు.

Next Story