డ్రగ్ మాఫియా దాడులకు బెదిరే ప్రసక్తి లేదు
Chandrababu Fires On YSRCP Leaders. డ్రగ్ మాఫియా దాడులకు బెదిరే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు
By Medi Samrat Published on 6 Oct 2021 9:50 PM IST
డ్రగ్ మాఫియా దాడులకు బెదిరే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నిజస్వరూపం బయటపెడితే దాడులకు దిగుతారా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం నిద్రపోతోందా? అని ఫైర్ అయ్యారు. తాలిబాన్ నుంచి తాడేపల్లికి ఉన్న లింకులన్నీ బయటపెట్టి తీరుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి నాయకుల ఏం జరిగినా డిజిపిదే బాధ్యతని అన్నారు. డ్రగ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్న మాఫియా నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ మూకతో దాడులకు తెగబడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని అన్నారు.
సాక్షాత్తు ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై డ్రగ్ మాఫియా దాడులకు దిగుతుంటే పోలీసు యంత్రాంగం నిద్రపోతోందా? అని ఫైర్ అయ్యారు. వైసిపి నేతల నిజస్వరూపం బయటపడుతుందనే భయంతోనే ఎమ్మెల్యే ద్వారంపూడి గూండాలు తెలుగుదేశం నేతలపై దాడులకు దిగారని ఆరోపించారు. డ్రగ్ మాఫియా ఆగడాలకు, వైసిపి మూకల తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తాలిబాన్లతో వైసిపి నేతలకు ఉన్న లింకులన్నీ ఒక్కొక్కటిగా బట్టబయలు ప్రజాక్షేత్రంలో ఎండగట్టి తీరుతామని చెప్పారు. పోలీసు యంత్రాంగం తక్షణమే కాకినాడలో తెలుగుదేశం నేతలపై దాడికి దిగిన మాఫియా మూకలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎటువంటి హాని జరిగినా ముఖ్యమంతి వైఎస్ జగన్, రాష్ట్ర డిజిపి, పోలీసు యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.