రైతులను ఎర్ర బంగారం ఏడిపిస్తుంటే..వారి కళ్లల్లో కూటమి సర్కార్ కారం కొట్టింది: షర్మిల
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కళ్లల్లో కారం కొడుతుందని వైఎస్ షర్మిల ఆరోపించారు.
By Knakam Karthik Published on 23 Feb 2025 4:21 PM IST
రైతాంగాన్ని ఎర్ర బంగారం ఏడిపిస్తుంటే..వారి కళ్లల్లో కూటమి సర్కార్ కారం కొట్టింది: షర్మిల
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కళ్లల్లో కారం కొడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర రైతాంగాన్ని ఎర్ర బంగారం ఏడిపిస్తోంది. మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పెట్టుబడి మందం రాక అడ్డికి పావు షేరు కింద అమ్ముకుంటూ రైతు కన్నీళ్లు పెడుతుంటే.. క్వింటాకు రూ.15 వేల నష్టంతో అమ్ముకుంటుంటే. అండంగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం రైతుల కళ్లల్లో కారం కొడుతుందని ఆరోపించారు.
మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి వారిని ఉద్ధరించినట్లు కూటమి ప్రభుత్వం గప్ఫాలు కొడుతుందని షర్మిల ఎక్స్లో రాసుకొచ్చారు. ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం లక్షన్నర లేదని రైతులు కంటతడి పెడుతున్నారు. కౌలు రైతుకు అదనంగా రూ.50 వేలకు నష్టమే అంటూ అల్లాడుతున్నారు. నిజంగా రాష్ట్ర రైతులపై కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంటే.. వెంటనే మిర్చి పంటకు కనీస ధర రూ.26 వేలు ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేశారు. లేదా నష్టపోతున్న మిర్చి రైతులను ఆదుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరల స్థిరీకరణ నిధి అమలు చేయాలని షర్మిల ఎక్స్లో రాసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం అని.. షర్మిల పేర్కొన్నారు.
మిర్చి రైతు విలవిలలాడుతుంటే టమాట సాగు చేస్తున్న రైతులకు తీరని కష్టాలు వచ్చి పడ్డాయని తెలిపారు. గిట్టుబాటు ధర లేక, కనీసం పెట్టుబడి రాక, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. మార్కెట్ లో కేజీ టమాట రూ.15 పలుకుతుంటే రైతుకు కిలో మూడు, నాలుగు రూపాయలు కూడా దక్కడం లేదన్నారు. ఎకరాకు రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన చోట 50 వేల మందం కూడా ఆదాయం లేదంటే టమాటా రైతుకు ఎంత అన్యాయం జరుగుతుందో అర్థం అవుతుంది. వెంటనే టమాటా రైతును ఆదుకోవాలని, టమాటా ధరలు పడిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.
రాష్ట్ర రైతాంగాన్ని ఎర్రబంగారం ఏడిపిస్తోంది. మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పెట్టుబడి మందం రాక అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటూ రైతు కన్నీళ్లు పెడుతుంటే.. క్వింటాకు రూ. 15 వేల నష్టంతో అమ్ముకుంటుంటే.. అండగా నిలవాల్సిన చంద్రబాబు గారి @ncbn కూటమి…
— YS Sharmila (@realyssharmila) February 23, 2025