రానున్న మూడు రోజులపాటు అతిభారీ వర్షాలు
ఐఎండీ సూచనల ప్రకారం దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Medi Samrat
ఐఎండీ సూచనల ప్రకారం దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే సోమవారం నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరోక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు కోస్తాలో చెదురుమదురుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. భారీవర్షాల నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోను పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.
ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.
రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
ఆదివారం(17-08-25)
•అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
* శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం(18-08-25)
* తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
•శ్రీకాకుళం, విజయనగరం,
పార్వతీపురంమన్యం,
అల్లూరి సీతారామరాజు,
విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మంగళవారం(19-08-25)
* శ్రీకాకుళం, విజయనగరం,
పార్వతీపురంమన్యం,
అల్లూరి సీతారామరాజు,
విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
శనివారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 30.2మిమీ, మన్యం జిల్లా జియమ్మవలసలో 27. 2మిమీ, కర్నూలు జిల్లా పందికోనలో 27మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.