పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వేగంగా బలపడుతోందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు తెల్లవారుజాము నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాగల మూడు రోజుల పాటు తీరం వెంబడి గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.