రాగల మూడు గంటల్లో అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల క్రింద నిలబడరాదని కోరారు.
ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ 28 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ నూతన మ్యాప్ను విడుదల చేసిందని పేర్కొంటూ, మీడియాలో, సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై ఏపీఎస్డిఎంఏ తరపున అటువంటి మ్యాప్ ఏదీ జారీ చేయబడలేదని లేదా విడుదల చేయబడలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఆ సమాచారం అవాస్తవం, తప్పుదోవ పట్టించేది, అనధికారికమైనదని తెలియజేసింది.
ఏపీఎస్డిఎంఏ పేరుతో, లోగోతో షేర్ చేయబడుతున్న ఆ మ్యాప్ ప్రామాణికమైనది కాదని తెలిపింది. ప్రజలు, మీడియా సంస్థలు, సంబంధిత వర్గాలందరూ ఇటువంటి ధృవీకరించని సమాచారాన్ని షేర్ చేయవద్దని, దానిని విశ్వసించవద్దని సూచించింది. విపత్తుల సంస్థ జారీ చేసే అధికారిక సమాచారాన్ని, ప్రచురణలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.