ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం నుండి మరొక ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు.
గురువారం(సెప్టెంబర్25)నాటికి తూర్పుమధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం(సెప్టెంబర్ 26) దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల్లో వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది శనివారం(సెప్టెంబర్ 27) దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
వీటి ప్రభావంతో ఆదివారం వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు, విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శుక్ర, శనివారాల్లో కోస్తాలో పలుచోట్ల అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం నుంచి ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదన్నారు.
బుధవారం(24-09-2025)
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం(జి) గరికిపాలెంలో 84.2మిమీ, ఎచ్చెర్లలో 79.7మిమీ, అనకాపల్లి(జి) చీడికాడలో 70మిమీ, వేచలంలో 64.5మిమీ, విజయనగరం(జి) మెరకముడిదాంలో 59.7మిమీ వర్షపాతం నమోదైందన్నారు.