రెడ్ అలర్ట్స్ ఇచ్చేశారు.. ఆ ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో, ఏపీలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ వెల్లడించింది

By M.S.R  Published on  14 Oct 2024 5:15 AM GMT
రెడ్ అలర్ట్స్ ఇచ్చేశారు.. ఆ ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో, ఏపీలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) స్పందిస్తూ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షం పడే సమయలో చెట్లు, కరెంటు స్తంభాలు, హోర్డింగ్ ల కింద ఉండరాదని ప్రజలకు సూచించింది. వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది.

అక్టోబర్ 14 నుండి 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తిరుపతి జిల్లా యంత్రాంగం, తిరుపతి నగరపాలక సంస్థ అందుకు సంబంధించి సన్నాహాలు చేస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్‌లు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయం, విద్యుత్‌తో సహా వివిధ శాఖల మధ్య ప్రయత్నాలను సమన్వయం చేయనున్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హోం, విపత్తు నిర్వహణ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా, తుఫాను సమీపిస్తున్న తరుణంలో ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు కీలక శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఆరుబయట వెళ్లడం మానుకోవాలని సూచించారు.

Next Story