ఏపీకి వ‌ర్ష సూచ‌న‌.. రాగ‌ల మూడు రోజులు వ‌ర్షాలు

AP Weather Alert. రుతుపవన ద్రోణి నేడు పోరుబందర్, సూరత్, జల్గావ్, రామగుండం, మచిలీపట్నంల

By Medi Samrat
Published on : 1 Sept 2021 2:50 PM IST

ఏపీకి వ‌ర్ష సూచ‌న‌.. రాగ‌ల మూడు రోజులు వ‌ర్షాలు

రుతుపవన ద్రోణి నేడు పోరుబందర్, సూరత్, జల్గావ్, రామగుండం, మచిలీపట్నంల మీదుగా ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది. ఉపరితల ద్రోణి దక్షిణ గుజరాత్ నుండి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టం నుండి 3.1 కీమీ నుండి 5.8 కీమీ ఎత్తుల మధ్య ఏర్పడింది. వీటి ప్రభావం వలన ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాల‌కులు తెలిపారు.

విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం కూడా ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉండ‌గా.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక రాయలసీమ జిల్లాల‌కు కూడా వ‌ర్ష సూచ‌న ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.


Next Story