అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan's review on construction of Ambedkar statue. విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం పనుల నిర్మాణ పురోగతిపై

By Medi Samrat  Published on  20 Jan 2023 8:59 AM GMT
అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష

విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం పనుల నిర్మాణ పురోగతిపై సీఎం జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. విగ్రహం తయారీ, దానిచుట్టూ సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై స‌మావేశంలో అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. విగ్రహ పీఠంతో కలుపుకుని మొత్తంగా 206 అడుగుల పొడవు వస్తుందని అధికారులు తెలిపారు. అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం రూ.268 కోట్లు కాగా.. పీఠం భాగంలో జీ ప్లస్‌ టూ నిర్మాణం ఉంటుందని.. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని అధికారులు సీఎంకు తెలిపారు.


విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరు కల్లా విగ్రహ నిర్మాణ పనులు పూర్తిచేస్తామని.. జనవరి 31 కల్లా విగ్రహానికి సంబంధించి కాస్టింగ్‌ చేసిన భాగాలన్నీ తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయని వివ‌రించారు. దాదాపు 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నామని వెల్లడించారు. కార్‌ పార్కింగ్, బస్‌ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నామని.. ఆదేశాల మేరకు అంబేద్కర్‌ స్మృతి వనానికి దారితీసే రోడ్లను సుందరీకరిస్తామని అధికారులు తెలిపారు.

ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా అన్ని పనులు పూర్తిచేయాలని.. అత్యంత నాణ్యతతో, అందంగా నిర్మాణాలు ఉండాలని.. పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Next Story