విదేశీ మోజులో పడి అక్రమ మార్గాల్లో వెళ్తున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకరంగా పెరుగుతోంది. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, అక్రమ వలసల ఫిర్యాదుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. గత ఐదేళ్లుగా ఏపీ ఈ జాబితాలో టాప్లో ఉండటం గమనార్హం. 2021 నుండి దేశవ్యాప్తంగా 6,700 ఫిర్యాదులు నమోదవ్వగా, అందులో దాదాపు సగం అంటే 3,294 కేసులు ఒక్క ఏపీ నుండే వచ్చాయి. అటు తెలంగాణలో కూడా 2025లోనే 111 ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి.
ముఖ్యంగా నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుంటున్న అక్రమ ఏజెంట్లు, విజిట్ వీసాల ద్వారా విదేశాలకు పంపి అక్కడ అక్రమంగా వదిలేస్తున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు ఇప్పుడు కంబోడియా, మయన్మార్ వంటి దేశాలకు కూడా 'డాంకీ' రూట్లలో పంపిస్తూ లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాలకు తెగించి సరిహద్దులు దాటుతూ విదేశీ జైళ్ల పాలవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా 3,505 మంది అక్రమ ఏజెంట్లను గుర్తించి బ్లాక్ లిస్ట్లో పెట్టింది. బాధితులకు సాయం చేయడానికి హైదరాబాద్తో పాటు పలు నగరాల్లో కేంద్రీయ ప్రవాసీ సహాయత కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది.