తిరుపతిలో మొదలైన జనసేన సందడి..!
Pawan Kalyan Tiruati Tour. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం 3 గంటలకు 'జైత్రయాత్ర' ను తిరుపతిలో
By Medi Samrat
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం 3 గంటలకు 'జైత్రయాత్ర' ను తిరుపతిలో మొదలు పెట్టనున్నారు. తిరుపతి లోక్సభ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని బీజేపీ, జనసేన భావిస్తూ ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోడానికి చాలా ప్రయత్నాలే చేస్తోంది.
ఏప్రిల్ 3న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటిస్తారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవలే తెలిపారు. బీజేపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం తిరుపతిలోని ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకూ పవన్ కళ్యాణ్ పాదయాత్ర ఉంటుందని తెలిపారు. బీజేపీ, జనసేన పొత్తుపై అనేక అనుమానాలు, అపోహలు, అసత్యాలు సృష్టించి ప్రత్యర్థులు దుష్ర్పచారం చేస్తున్నారని.. కానీ, రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే రెండు పార్టీలు కలిసినట్లు నాదెండ్ల మనోహర్ అన్నారు. 3న మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు.
జనసేన-బీజేపీ పొత్తు లో భాగంగా బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ బరిలో ఉన్నారు. రత్నప్రభ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. పవన్ కళ్యాణ్ తిరుపతికి రానున్నాడని తెలిసి.. పెద్ద ఎత్తున అభిమానులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. పవన్ పర్యటన అటు జనసైనికుల్లోనూ జోష్ నింపనుంది. జనసేనాని టూర్ తమకు కలిసొస్తుందని బీజేపీ కూడా భావిస్తోంది.