అనేక హామీలిచ్చి వెన్నుపోటు పొడిచారు, ఆయనేమో చేతులెత్తేశాడు: కిషన్ రెడ్డి

యూపీఏ హయాంలో రోజూ పేపర్ చూసినా, టీవీ చూసినా..కుంభకోణాలే కనిపించేవి, హెడ్‌లైన్స్‌లో కాంగ్రెస్ అవినీతి వార్తలు ఉండేవి..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

By Knakam Karthik
Published on : 22 Jun 2025 7:27 PM IST

Telangana, Congress Government, Bjp, Union Minister Kishanreddy, Cm Revanthreddy

అనేక హామీలిచ్చి వెన్నుపోటు పొడిచారు, ఆయనేమో చేతులెత్తేశాడు: కిషన్ రెడ్డి

యూపీఏ హయాంలో రోజూ పేపర్ చూసినా, టీవీ చూసినా..కుంభకోణాలే కనిపించేవి, హెడ్‌లైన్స్‌లో కాంగ్రెస్ అవినీతి వార్తలు ఉండేవి..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఒక రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉండేది. ఈరోజు ప్రధాని మోదీ నేతృత్వంలో.. గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛభారత్ టాయిలెట్ నుంచి మొదలు పెడితే.. చంద్రమండలంలో త్రివర్ణ పతాకం ఎగురవేసే వరకు ప్రతి రంగంలో అద్భుత ప్రగతి సాధించాం. ఆనాడు పాకిస్తాన్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా.. దేశంలోని అన్ని నగరాల్లో ఐఎస్ఐ ఏజెంట్లను పెట్టుకునేది. హైదరాబాద్ నగరంలో బీజేపీ నాయకులు సహా, పోలీస్ అధికారులపై తీవ్రవాదులు దాడులు చేశారు. దిల్ సుఖ్ నగర్, గోకుల్ చాట్ సహా నగరంలో మూడు చోట్ల ఉగ్రవాదులు బ్లాస్టింగ్స్ చేశారు. ఆనాడు పాకిస్తాన్ అనుకుంటే.. భారత దేశంలో ఏ నగరంలోనైనా బాంబు పేలుళ్లు జరిపేది. ఏమీ చేయలేని పరిస్థితిలో భారతదేశం నష్టాన్ని భరించింది. ఎన్ని దాడులు జరిగినా.. ఆనాటి ప్రభుత్వం పాకిస్తాన్ ను ఏమీ చేయలేని దుస్థితిలో ఉండేది...అని కిషన్ రెడ్డి అన్నారు.

ఇదే సభలో సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ఒక కుటుంబం బారినపడి ఏ రకంగా బలి అయ్యామో మనకు తెలుసు. ధనికరాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్ల అప్పులపాలైంది. ఏ రకంగా.. అవినీతి పాలనతో, దోపిడీ, కుంభకోణాలతో, అహంకారంతో, కుటుంబ పాలనతో తెలంగాణను దెబ్బతీశారో చూశాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పనిచేసిందో మనం చూశాం. కేసీఆర్ ను వద్దనుకొని, సోనియా గాంధీ మాటలు నమ్మి.. ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. గడిచిన ఏడాదిన్నరలో ప్రజల నమ్మకాన్ని ఎలా వమ్ము చేసిందో చూస్తున్నాం. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి.. వెన్నుపోటు పొడిచారు. అప్పులు ఇచ్చేవారు లేరని, నన్ను నమ్మేవాడు లేడని.. సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశాడు. పరిపాలన చేతగాక.. హామీలు అమలు చేయలేకి కాంగ్రెస్ రాష్ట్రంలో చేతులెత్తేసింది. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కావొచ్చు.. కాంగ్రెస్ పార్టీ కావొచ్చు.. కేసీఆర్ గానీ, రాహుల్ గాంధీ కానీ.. విఫలమయ్యారు. ఈ రాష్ట్రంలో నిజంగా తెలంగాణకు మేలు జరగాలంటే... ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే.. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరుల ఆత్మలు శాంతించాలంటే.. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీతోనే సాధ్యం. వచ్చే శాసనసభకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా..మోదీ నాయకత్వంలో తెలంగాణలో కాషాయజెండా ఎగురడం ఖాయం. తెలంగాణకు ఏకైక రక్ష బీజేపీ..అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story