వారి సహకారంతో గెలిచిన టీఆర్ఎస్ గెలుపు.. ఒక గెలుపేనా?

TPCC President Revanth Reddy Fire On TRS. తెలంగాణలో భారత్ జోడో యాత్రలో రాహుల్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

By Medi Samrat  Published on  9 Nov 2022 1:45 PM GMT
వారి సహకారంతో గెలిచిన టీఆర్ఎస్ గెలుపు.. ఒక గెలుపేనా?

తెలంగాణలో భారత్ జోడో యాత్రలో రాహుల్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. చారిత్రక కట్టడం చార్మినార్ మీదుగా యాత్ర అద్భుతంగా సాగింది. రాచరిక విధానాలపై పోరాటం చేయడానికి రాహుల్ కార్యోన్ముఖులై కదిలారని పేర్కొన్నారు. దేశంలో సమస్యలపై కొట్లాడాలని ఆలోచనతో రాహుల్ ముందుకు కదిలారు. కాగడాల ప్రదర్శనతో కాంతి రేఖలు నింపుతూ మహారాష్ట్ర గడ్డపై జోడో యాత్ర అడుగు పెట్టిందని పేర్కొన్నారు. పాదయాత్రలో అందరికీ భరోసానిస్తూ రాహుల్ గాంధీ ముందుకు కదిలారు. ప్రపంచంలో ఇంత అద్భుతమైన సన్నివేశం ఎక్కడా కనిపించదని అన్నారు.

భారత్ జోడో యాత్రతో రాహుల్ ఒక నూతన శకానికి తెర లేపారు. దేశం ప్రమాదకర పరిస్థితిలోకి నెట్టివేయబడుతున్న సమయంలో రాహుల్ ఒక భరోసాగా కనిపించారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సందర్భం ఇది అని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నా బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించానని.. ప్రజల్లో భరోసాను నింపేందుకు, జోడో యాత్ర స్పూర్తితో మళ్లీ ప్రజల ముందుకు వస్తాం అని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన కార్యచరణతో ప్రజల్లోకి వెళుతుంది. టీఆర్ఎస్, బీజేపీ వైఖరిని ప్రజలకు వివరించేందుకు ఒక కార్యచరణతో ముందుకొస్తాం అని తెలిపారు.

మునుగోడులో టీఆర్ఎస్‌ది సాంకేతిక విజయం మాత్రమేన‌ని రేవంత్ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలవదని కేసీఆర్ స్వయంగా ఒప్పుకుని కమ్యూనిస్టుల సహకారం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ పరాన్న జీవిగా మారిందని విమ‌ర్శించారు. పరాయి వ్యక్తులపై, శక్తులపై ఆధారపడి టీఆర్ఎస్ గెలిచిందని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టుల సహకారంతోనే టీఆర్ఎస్ గెలిచింది. మునుగోడులో బీజేపీ బరితెగించిందని విమ‌ర్శించారు. వందల కోట్లు పంచిపెట్టి దేశంలోనే మునుగొడును తాగుబోతు నియోజకవర్గంగా నిలబెట్టారని అన్నారు.

20 రోజుల్లో 300 కోట్ల రూపాయల మందును తాగించారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రజలను తాగుబోతులుగా మార్చాయంటే అక్కడి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. చుక్క మందు పోయకుండా కాంగ్రెస్ 24వేల ఓట్లు పొందిందని గర్వంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ను మూడో స్థానానికి నెట్టడానికి చాలా మంది బీజేపీ నాయకులు తిష్ట వేశారు.. ఇంతకంటే సిగ్గుచేటు దేశంలో ఉందా? అని విమ‌ర్శించారు. దేశానికి నాయకుడవుతానన్న కేసీఆర్ సొంత కాళ్లపై నిలబడలేకపోయారు. కమ్యూనిస్టుల సహకారంతో గెలిచిన టీఆర్ఎస్ గెలుపు.. ఒక గెలుపేనా? అని ఎద్దేవా చేశారు.

వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి అభ్యర్థిని కొనుక్కున్న మోదీ కి సామాజిక స్పృహ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ఖతం అయిందని మోదీ ప్రకటించడం దిగజారుడుకు పరాకాష్ట. ఓటమిని సమీక్షించుకోకుండా కాంగ్రెస్ సఫా అయిందని మోదీ సంబరపడుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మిత్రులే అని మోదీ ప్రకటనతో నిరూపితమైందని రేవంత్ అన్నారు. డబ్బు, మద్యం కలిసి ఎన్నికల్లో తెలంగాణ సమాజాన్ని ఓడించాయి. దేశానికి ఎన్నికల సంఘం అవసరం లేదని మునుగోడు ఉప ఎన్నికతో నిరూపితమైంది. ఎన్నికల సంఘం ఉన్నా ఊపయోగం లేదని తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో కాంగ్రెస్ పై ప్రజల్లో మమకారం తగ్గలేదని అర్ధమైంది. పాండవుల ఓటమితో కౌరవుల పతనం ప్రారంభమైనట్లేన‌ని అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమి రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ పతనానికి పునాది. మునుగోడు ఫలితాలపై నేను సంతృప్తిగా ఉన్నాన‌ని పేర్కొన్నారు. మా కార్యకర్తల పోరాట పటిమను నేను అభినందిస్తున్నా. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మా కార్యాచరణ ఉంటుందని తెలిపారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిది కాదని అన్నారు. ఏఐసీసీ ఆదేశాల ప్రకారం టీపీసీసీ ముందుకు వెళుతుందని తెలిపారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే గవర్నర్ తో టీఆర్ఎస్ పంచాయతీ అని అన్నారు. చిల్లర పంచాయితీలతో సమస్యలను పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. గవర్నర్ సందేహలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అన్నారు. ప్రతీది గవర్నర్ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. గవర్నర్.. బండి సంజయ్, కిషన్ రెడ్డి పాత్రను పోషించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్, బీజేపీ ఇలాంటి చిల్లర పంచాయతీలు మానుకోవాలి. టీఆర్ఎస్, బీజేపీ ది మిత్ర బేధం మాత్రమే.. శత్రు బేధం కాదని.. వీళ్ల చర్యలతో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. పీఎం స్థాయిలో బీజేపీ వ్యవహరించడం లేదు.. సీఎం స్థాయిలో కేసీఆర్ స్పందించడం లేదని కామెంట్ చేశారు. సాధారణ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్ర‌జ‌లు ఖచ్చితంగా బుద్ది చెబుతారని విశ్వాసం వ్య‌క్తం చేశారు. విచారణ అధికారుల వద్ద ఉండాల్సిన వీడియోలు.. ప్రగతి భవన్ లో ఉన్నాయంటే అర్థం ఏంటి? చీకటి ఒప్పందంలో భాగమే కేసీఆర్ ఆ వీడియోలు విడుదల చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయం కేవలం ప్రజల్ని మభ్య పెట్టె రాజకీయ కోణం మాత్రమేన‌ని అన్నారు. జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులు మా సహజ మిత్రులు.. వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాక కాంగ్రెస్ తో కలిసి సమస్యలపై పోరాటం చేస్తారని ఆశిస్తున్నామ‌ని అన్నారు.


Next Story