కవిత చెప్పిన దెయ్యాలు 'ఆ ముగ్గురే'.. కాంగ్రెస్ నేత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కవిత లేఖ గురించి పది రోజుల ముందే చెప్పానని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు

By Medi Samrat
Published on : 24 May 2025 3:52 PM IST

కవిత చెప్పిన దెయ్యాలు ఆ ముగ్గురే.. కాంగ్రెస్ నేత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కవిత లేఖ గురించి పది రోజుల ముందే చెప్పానని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కవిత చెప్పిన దెయ్యాలు సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావులేన‌న్నారు. కవితను సస్పెండ్ చేసేందుకు స్కెచ్ వేశారని.. నేడో, రేపో కవితను సస్పెండ్ చేస్తారని.. సంతోస్‌ను పార్టీ ప్రెసిడెంట్ చేసే అవకాశముంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కేసీఆర్ పరిస్థితి జయలలితలాగా తయారైందన్నారు. కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆమె సొంత పార్టీ పెట్టుకుంటుందన్నారు. కవితతో మాట్లాడి సమస్య పరిష్కరించుకునే ఆలోచన కేటీఆర్‌కు లేదన్నారు. సొంత మనుషులే కేసీఆర్‌ను వెన్నుపోటు పొడుస్తారన్నారు. కుటుంబాన్ని విచ్చిన్నం చేసినా కేసీఆర్ నిస్సహాయుడిగా ఉన్నారన్నారు.

పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడితే గతంలో అనేకమందిపై కేసీఆర్ చర్యలు తీసుకున్నారు.. కేసీఆర్‌తో కవిత మాట్లాడతా అంటే సంతోష్ అడ్డుకున్నాడన్నారు.. కేసీఆర్ ఏం చేయాలో, ఎవర్ని కలవాలో సంతోష్ డిసైడ్ చేస్తున్నారు.. కేసీఆర్ దర్శనానికి ఎమ్మెల్యేల దగ్గర సంతోష్ డబ్బులు తీసుకుంటాడని ఆరోపించారు.

తండ్రి, బిడ్డల మధ్య ఇంత గ్యాప్ సృష్టించిన దెయ్యం ఎవరు.? అని ప్ర‌శ్నించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన కేటీఆర్.. పార్టీలో జరుగుతున్న వివక్షపై స్పందించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇస్తున్న కేటీఆర్.. వాళ్ల పార్టీ గురించి ఆలోచించుకోవాలని సూచించారు. క‌వితను పార్టీ నుండి పంపించే ప్రయత్నం జరుగుతోందని.. కవితకి, బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం తెగిపోతుందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.



Next Story