ఆపరేషన్ కగార్ ఆపేసి మావోయిస్టులతో చర్చలెందుకు జరపరు?: టీపీసీసీ చీఫ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఆపరేషన్ కగార్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik
ఆపరేషన్ కగార్ ఆపేసి మావోయిస్టులతో చర్చలెందుకు జరపరు?: టీపీసీసీ చీఫ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఆపరేషన్ కగార్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పని చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు ఎందుకు జరపదని హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన ఎల్బీస్టేడియం సందర్శించారు. ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే బహింగ సభకు చేస్తున్న ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, వీహెచ్, రోహిన్ రెడ్డి, శివసేనా రెడ్డి, ఫహీం ఖురేషీలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని ఫాసిస్ట్ మోడీ పాలనను ఎండగట్టేందుకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్కు వస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ చెబితేనే.. ప్రధాని మోడీ, అమిత్ షా లాలూచీ పడి పాకిస్థాన్తో యుద్ధం ఆపేశారు. మరోవైపు కాల్పుల విరమణకు సిద్ధమని, వెంటనే తమతో కేంద్రం చర్చలు జరపాలంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారని తెలిపారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి, భద్రతా దళాలు సీజ్ ఫైర్ చేసి వారితో ఎందుకు చర్చలు జరపరని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రధాని మోడీ, అమిత్ షాలను ప్రశ్నించారు. జూన్ 4న ఎల్బీ స్టేడియంలో జరగబోయే సభకు గ్రామ శాఖ అధ్యక్షుల నుంచి మండల, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల రాష్ట్ర స్థాయి నేతలు మొత్తం 25 వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు. సభకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.