ఆ పార్టీ డీఎన్ఏలోనే కరప్షన్ ఉంది, రాష్ట్రం పరువు తీశారు: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే కరప్షన్ ఉంది..అని తెలంగాణ మంత్రి సీతక్క ఆరోపించారు.
By Knakam Karthik
ఆ పార్టీ డీఎన్ఏలోనే కరప్షన్ ఉంది, రాష్ట్రం పరువు తీశారు: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే కరప్షన్ ఉంది..అని తెలంగాణ మంత్రి సీతక్క ఆరోపించారు. సీఎం రేవంత్ రాష్ట్రం పరువు తీస్తున్నారని శాసనమండలిలో కవిత చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర పరువు తీసింది ఎవరు? మీ కుటుంబమే రాష్ట్రం పరువు తీసింది. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది మీరు, మీ కుటుంబం. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్. మహిళలకు అడుగడుగునా అన్యాయం చేసింది బీఆర్ఎస్. మొదటి ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవిలో మహిళలు లేరు, మహిళా కమిషన్కి సభ్యులు లేరు. మహిళలు పొదుపు చేసుకున్న రూ.1800 కోట్ల అభయ హస్తం నిధులు ఇవ్వలేదు. పావలా వడ్డీ ఇవ్వలేదు. మహిళ సంఘాలకు ఇవ్వాల్సిన రూ. 3700 కోట్ల వడ్డీలు చెల్లించలేదు. తెలంగాణను మీరు సస్యశ్యామలం చేస్తే, రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారు. మేము పంట కాలువలు మూసివేసినట్లుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది..అని మంత్రి సీతక్క మండిపడ్డారు.
ఇష్టానుసారంగ ఎస్టిమేషన్స్ పెంచి దోచుకు తిన్నారు. మీరు నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారు. మీరు చేయలేని ఉద్యోగాల భర్తీ మేం చేస్తున్నాం. 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. మీరు అన్ని చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు. బీఆర్ఎస్ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాలేదు. మీరు మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లతో వచ్చారు. మేము 65 సీట్లతో అధికారంలోకి వచ్చాం. పది సంవత్సరాలలో ఎన్ని ఇళ్లు ఇచ్చారు?. ప్రజలకు ఇండ్లు ఇవ్వలేదు కాబట్టే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మేము వచ్చి 15 నెలలు అయింది.. అప్పుడే అన్ని కావాలన్నట్టుగా అక్కసు వెల్లగక్కుతున్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు.. వారి పేరు పథకాలకు పెడితే ఎందుకంత కడుపు మంట. మీరు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఎన్నో హామీలు తుంగలో తొక్కారు. రాష్ట్రం పరువు తీసింది మీరే.. తప్పుడు ప్రచారం చేయొద్దు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..అని మంత్రి సీతక్క హెచ్చరించారు.