బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు అనుమతి

Telangana High Court permits Bandi Sanjay Padayatra. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు పర్మిషన్‌ ఇచ్చింది.

By అంజి  Published on  25 Aug 2022 1:55 PM GMT
బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు అనుమతి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు పర్మిషన్‌ ఇచ్చింది. పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది. యాత్ర ఆపేందుకు పోలీసులు ఇచ్చిన నోటీసులు.. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలతో బండి సంజయ్‌.. రేపటి నుంచి యాత్రకు రెడీ అవుతున్నారు. ఆగస్టు 23న బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని వర్ధన్నపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయండని మంగ‌ళ‌వారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు వర్దన్నపేట ఏసీపీ నోటీసులు జారీ చేశారు. జ‌నగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు.

రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుండి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని నోటీసులో తెలిపారు పోలీసులు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలోనే పాదయాత్రకు పర్మిషన్‌ ఇవ్వాలని.. బీజేపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇవాళ దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రకు పచ్చ జెండా ఊపింది.

Next Story