తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐసీసీ (AICC)కి ఏటీఎంగా మార్చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా తాము చెబుతున్న విషయాన్నే ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని ఆయన విమర్శించారు. రైతులకు, మహిళలకు, యువతకు ఇచ్చిన 420 హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను, లగచర్లలో గిరిజనుల భూములను, చివరకు విశ్వవిద్యాలయాల భూములను కూడా వదలడం లేదని ఆరోపించారు. అనుముల బ్రదర్స్ కలిసి తెలంగాణ భూములను అప్పనంగా దోచుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
కేవలం రెండేళ్లలోనే ఈ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిందని, కానీ రాష్ట్రంలో ఒక్క కొత్త నిర్మాణం కూడా చేపట్టలేదని కేటీఆర్ విమర్శించారు. దండుపాళ్యం ముఠా తరహాలో తెలంగాణ సంపదను దోచుకుంటూ, సొంతానికి దాచుకుంటూ రేవంత్ సర్కార్ కాలం గడుపుతోందని ధ్వజమెత్తారు. తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీకి నిరంతరం డబ్బు సంచులు మోస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి నిధుల గనిగా మార్చిన తీరుపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.