విద్యార్థులకు శుభవార్త..ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik
Published on : 19 Jun 2025 7:17 AM IST

Telangana, Education News, Students, Congress Government, CM Revanth, Engineering Fees

విద్యార్థులకు శుభవార్త..ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ను ప్రస్తుతానికి పాత ఫీజులతోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ ఏడాది ఫీజుల పెంపు లేనట్టేనని తేలిపోయింది. ఈ విద్యాసంవత్సరంలో పాత ఫీజులే ఉండనున్నాయి. జూలైలో కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుండగా, పాత ఫీజుల ప్రకారమే సీట్లను భర్తీచేయనున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులపై లోతుగా అధ్యయనం చేయాలని, ఆలస్యమైనా పర్వాలేదని విద్యాశాఖ అధికారులకు స్పష్టం చేశారు.

టీఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదిత ఫీజులపై సమగ్ర అధ్యయనం చేయాలని బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సబ్‌ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. సబ్‌ కమిటీ ఏర్పాటు బాధ్యతలను తెలంగాణ ఉన్నత విద్యామండలికి అప్పగించారు. ఫీజుల ఖరారు కోసం బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో టీఏఎఫ్‌ఆర్సీ సమావేశమైంది. చైర్మన్‌ జస్టిస్‌ గోపాల్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్‌ ఎం కుమార్‌, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఫీజుల సవరణపై ఈ సమావేశంలో చర్చించారు. టీఏఎఫ్‌ఆర్సీ ఇప్పటికే పలు కాలేజీల ఫీజులను ఖరారు చేయగా, కొన్ని కాలేజీల్లో ఫీజులు అసాధారణంగా పెరిగాయి. అయితే ఆయా ఫీజుల సవరణపై మరోమారు అధ్యయనం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యాకోర్సుల ఫీజుల సవరణకు ప్రస్తుతానికి బ్రేకులు పడినట్టేనని చెప్తున్నారు.

Next Story