ములుగు జిల్లాలోని కర్రిగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. కర్రిగుట్టలలో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టలో ఇవాళ తెల్లవారుజాము నుంచి కాల్పుల మోత మోగుతోందనే ప్రచారం జరుగుతోంది. వెంకటాపురం మండల పరిధిలోని కర్రిగుట్టపై బాంబులు అమర్చామని, అటువైపు ఆదివాసీలు ఎవరూ రావొద్దంటూ ఇటీవలే మావోయిస్టుల నుంచి ఓ లేఖ విడుదలైన విషయం తెలిసిందే.
ఇక కర్రిగుట్టల్లో ఓ కీలక నేత నేతృత్వంలో భారీగా మావోయిస్టులు అక్కడ సంచరిస్తున్నారనే సమాచారం మేరకు తెలంగాణ , ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసుల అధ్వర్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు ‘బచావో కర్రిగుట్టలు’ పేరుతో భారీ ఆపరేషన్ చేపడుతున్నాయి. అయితే, ఛత్తీస్గఢ్ వైపు నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు వరుసగా కాల్పులు జరుపుతూ మావోయిస్టులను వెంబడిస్తుండగా.. వారంతా వేగంగా కర్రిగుట్టల వైపు కదులుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే అక్కడ మోహరించిన భద్రతా బలగాలు కర్రిగుట్టలను చుట్టుముట్టాయి. ఈ పరిణామంతో అక్కడ ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.