ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేయనున్నారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించబోతున్నారు. ఫాంహౌస్ కు సిట్ అధికారులు బయలుదేరారు. సిట్ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్ లు సిట్ విచారణకు హాజరయ్యారు.
'బిగ్ బాస్' ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామన్న నాటి అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగా కీలక నేతలను సిట్ విచారిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు కేసీఆర్కు నోటీసులతో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలన మలుపు తిరిగింది. అప్పటి ప్రభుత్వాధినేత కేసీఆరే కావడంతో సిట్ ఆయయను ఎలాంటి ప్రశ్నలు అడగనుంది, కేసీఆర్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్కు సిట్ నోటీసులతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్ జరిగిందన్న ప్రభుత్వం రెండేళ్లుగా విచారణ జరుపుతోంది. తొలుత ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చుట్టే తిరిగింది. ఆయన విదేశాలకు వెళ్లిపోవడంతో దర్యాప్తు నెమ్మదించింది. ఎట్టకేలకు ప్రభాకరావును విదేశాల నుంచి రప్పించి సుదీర్ఘంగా విచారించారు. ఆయన స్టేట్మెంట్ల ఆధారంగా నాటి కీలక నేతలపై సిట్ ఫోకస్ పెట్టింది.