స్వార్ధ రాజకీయలకు దేశాన్ని ప్రయోగశాలగా మార్చారు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires On PM Modi. తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య విజయోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పీసీసీ అధ్యక్షుడు

By Medi Samrat  Published on  15 Aug 2021 8:39 AM GMT
స్వార్ధ రాజకీయలకు దేశాన్ని ప్రయోగశాలగా మార్చారు : రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య విజయోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో జ‌రిగిన 75వ స్వాతంత్ర్య వేడుకలలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. స్వాతంత్ర్య జరుపుకుంటున్నామంటే కాంగ్రెస్ నేతల త్యాగాలే కారణమ‌ని అన్నారు. ఎంతో మంది అమరులు తమ ప్రాణాలను బలిచ్చి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చారని.. ప్రజాస్వామ్య స్పూర్తితో, శాంతియుత వాతావరణంలో స్వాతంత్ర్య ఉద్యమం జరిగిందని అన్నారు. హింసకు తావులేకుండా ఉద్యమం చేయడంతోనే దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిందని తెలిపారు.

శాంతియుత ఉద్యమాలు నిర్వహించడంలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శి అని కొనియాడారు. కొన్ని రాజకీయపార్టీలు మతాల మధ్య చిచ్చుపెడుతూ.. స్వార్ధ రాజకీయలకు దేశాన్ని ప్రయోగశాలగా మార్చారని ఫైర్ అయ్యారు. రైతులకు ఉచిత కరెంట్, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధర, భూములపై సీలింగ్ యాక్ట్ తెచ్చి దళితులకు గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు హక్కులు కల్పించింది కాంగ్రెసేన‌ని వివ‌రించారు. మోదీ పాసిస్టు ప్రభుత్వం వచ్చాక రైతుల జీవితాలను కట్టుబానిసలుగా మార్చి అంబానీ, ఆదానీలకు తాకట్టుపెట్టేలా నల్ల చట్టాలు తెచ్చారని.. రైతులు మొక్కవోని దీక్షతో 9 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారని అన్నారు.

కేసీఆర్ కొరివి దైయ్యంలా ప్రాజెక్టుల పేరుతో.. అభివృద్ధి కార్యక్రమాలు పేరుతో దళిత గిరిజన భూములను లాక్కొని బజార్ లో నిలబెట్టాడడ‌ని మండిప‌డ్డారు. పోడు భూములకు కాంగ్రెస్ పట్టాలిస్తే.. హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులతో ఆడబిడ్డ‌లను చెట్లకు కట్టేసి హింసించి గుంజుకుంటున్నారని.. ఖమ్మంలో చంటిపిల్లలున్న ఆడబిడ్డలను సైతం జైలుకు పంపి పాశవికంగా పాలిస్తున్నారని ఫైర్ అయ్యారు.

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించినప్పుడే.. రైతులకు, యువతకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు రేవంత్ పిలుపునిచ్చారు. ఇద్దరినీ గద్దె దించేందుకు ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఏడాది పొడుగునా పోరాటం చేయాలని సూచించారు. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్.. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని మోదీ నిరుద్యోగులను మోసం చేసారని.. నిరుద్యోగ యువతను ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. ఏడేళ్లలో కేసీఆర్‌ఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే రిటైర్ అయినా ఉద్యోగులే ఎక్కువ అని.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. అఖండ భారత్ గా నిలబెట్టే శక్తి కాంగ్రెస్ కే ఉందని.. రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రపంచ దేశాల ముందు భారత్ ని ఒక శక్తిగా నిలుపుదాం అని రేవంత్ అన్నారు.


Next Story