కేటీఆర్ పరిపక్వత, బాధ్యత లేని మంత్రి : రేవంత్ రెడ్డి

Revanth Reddy criticized Minister KTR. హైద్రాబాద్ గాంధీ భవన్‌లో శ‌నివారం కాంగ్రెస్‌ పీఏసీ సమావేశం జ‌రిగింది.

By Medi Samrat  Published on  17 Jun 2023 3:04 PM GMT
కేటీఆర్ పరిపక్వత, బాధ్యత లేని మంత్రి : రేవంత్ రెడ్డి

హైద్రాబాద్ గాంధీ భవన్‌లో శ‌నివారం కాంగ్రెస్‌ పీఏసీ సమావేశం జ‌రిగింది. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, పీసీ విష్ణునాథ్‌, మన్సూర్ అలీఖాన్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు స‌మావేశంలో పాల్గొన్నారు. స‌మావేశం అనంత‌రం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించామ‌ని తెలిపారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా షబ్బీర్ అలీ బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. మండల కమిటీలకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయని.. 10రోజుల్లో అన్ని మండల కమిటీలు పూర్తి చేస్తామ‌ని తెలిపారు.

దశాబ్ది ఉత్సవాలు బీఆర్ఎస్ సొంత వ్యవహారంలా చేస్తోంది. ఇది ప్రజలకు అసౌకర్యంగా మారింది.. దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిపోయిందని.. పరిపాలన వ్యవస్థ స్తంభించిపోయిందని ఆరోపించారు. గ్రామస్థాయి నుంచి అందరు అధికారులు బీఆర్ఎస్ సేవలో మునిగిపోయారని.. దశాబ్ది ఉత్సవాలు కాదు.. దశాబ్ది దగా అని విమ‌ర్శించారు.

బీఆర్ఎస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళతామ‌న్నారు. ఈ నెల 22న 119 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చారు. ఈ నిరసన ర్యాలీల‌లో రావణాసురుడి రూపంలో ఉన్న కేసీఆర్.. పది వైఫల్యాలతో కూడిన దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని అన్నారు. ఆర్డీఓ కార్యాలయాలు లేదా ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రం సమర్పించాలని సూచించారు. పదేళ్లలో కేసీఆర్ అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి తీసుకెళతామ‌న్నారు.

కేజీ టూ పేజీ, ఫీజు రీయింబర్స్ మెంట్ , నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్ హామీల అమలు ఊసే లేదని విమ‌ర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుచేసేలా మా నిరసన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

బీసీ డిక్లరేషన్, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్ పై చర్చ జరుగుతోందని అన్నారు. భట్టి పాదయాత్ర ఈ నెలాఖరులో ముగుస్తుందని తెలిపారు. ఖమ్మంలో జాతీయ నాయకులతో ఒక భారీ ముగింపు సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామ‌న్నారు. భట్టితో సంప్రదించి ముగింపు సభ నిర్వహించాలనుకుంటున్నామ‌ని తెలిపారు. బీసీలలో ఉన్న అన్ని కులాలకు లక్ష రూపాయల రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీ.నర్సింగరావు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి.. అలాంటి ఆయనకు ప్రభుత్వ పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం దురదృష్టకరమ‌న్నారు. కేటీఆర్ సినిమా ఇండస్ట్రీలో ఎవరివైపు ఉంటారో అందరికీ తెలిసిందేన‌ని.. తెలంగాణ కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్ కు లేదని అన్నారు. ఇప్పటికైనా వారిని గౌరవించి వారికి అపాయింట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ అవమానించారన్నారు. పదేళ్లు పూర్తయినా 600 మంది అమరులను కూడా గుర్తించలేకపోయారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేటీఆర్ పరిపక్వతలేని, బాధ్యత లేని మంత్రి అని విమ‌ర్శించారు. అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి.. అందుకే మా కార్యాచరణ అని వివ‌రించారు. పథకాలు కొనసాగిస్తామని చెప్పడం కేసీఆర్ ను సీఎం గా కొనసాగాలని కోరుకుంటునట్టేన‌న్నారు.

అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ఉండాలని వారు కోరుకుంటున్నారు. వాళ్లిద్దరూ ఒక్కటే అని మేం ముందునుంచీ చెబుతున్నాం. రెండవ రాజధానిపై ప్రతిపాదన వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళుతుందా? రాష్ట్రానికి వెళుతుందా తెలియాలన్నారు. విస్తృతంగా చర్చించిన తరువాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామ‌న్నారు.

చేరికలపై ఊహాగానాలు వద్దు. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక మేమే అధికారికంగా ప్రకటిస్తామ‌ని వెల్ల‌డించారు. తెలంగాణ ఉద్యమంలోలా.. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో మీడియా కూడా భాగస్వామి కావాలని కోరారు.


Next Story