ఎన్నికల ముందు రైతు బంధు వేయడంతో రైతులకు 5 వేలు నష్టం : రేవంత్

కేసీఆర్, మోదీ మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బయటపడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  25 Nov 2023 7:00 AM GMT
ఎన్నికల ముందు రైతు బంధు వేయడంతో రైతులకు 5 వేలు నష్టం : రేవంత్

కేసీఆర్, మోదీ మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బయటపడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. రైతు బంధు, వివేక్, పొంగులేటి ఇళ్ల‌ల్లో ఐటీ దాడులు, గోయల్ ఇంట్లో 300 కోట్లను సీజ్ చేయకపోవడం.. కాంగ్రెస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేయడంపై ప్ర‌స్తావించారు.

2018లో జూన్ లో రైతు బంధు పథకం ప్రారంభించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 2018లో షెడ్యూల్ వచ్చాక రైతు బంధు విడుదల చేశారు. ఆనాడు ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేశారని విశ్లేషకులు చెప్పారు. 2023 ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15లోగా రైతు బంధు వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసాం. రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరాం. కానీ పోలింగ్ నాలుగు రోజులు ఉండగా రైతు బంధు విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బీఆర్ఎస్ కు సహకరించిందని.. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింద‌న్నారు.

ఎన్నికల ముందు రైతు బంధు వేయడంతో రైతులకు 5 వేలు నష్టం జరుగుతోందన్నారు. కౌలు రైతులు, రైతు కూలీలుగా పూర్తిగా నష్టపోతున్నారన్నారు. బీఆర్ఎస్ ఇచ్చే రైతు బంధుతో రైతులు ప్రలోభాలకు గురి కావద్దన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు.. కేసీఆర్ ఇచ్చేవి తీసుకోండి.. కాంగ్రెస్ వచ్చాక మేం ఇవ్వాల్సింది ఇస్తామ‌న్నారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 2018 లాగే ఇప్పుడూ కేసీఆర్ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆర్ఎస్ ఓటమి ఖాయం అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసాను పూర్తిగా అమలు చేస్తుంద‌న్నారు. వివేక్ బీజేపీలో ఉండగా రాముడికి పర్యాయపదంగా ఆయన్ను చూపించారు. కానీ కాంగ్రెస్ లో చేరాక బీజేపీ కి ఆయన రావణాసురుడిగా కనిపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరిస్తున్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువైన పాపానికి రఘురామ్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు. బంధుత్వం కూడా బీఆర్ఎస్ దృష్టిలో నేరంగా కనిపిస్తోంది. ఆర్. సురేందర్ రెడ్డిపై ఇప్పటివరకు వేలెత్తి చూపిన వారు లేరు. ఒప్పందంలో భాగంగానే బీజేపీ, బీఆర్ఎస్ వారిని టార్గెట్ చేసింద‌న్నారు.

ఏకే గోయల్ ఇంట్లో వెయ్యి కోట్లు పంపిణీ జరిగిందని మేం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతల ఫోన్స్ కూడా ఎత్తడం లేదు.. ఈడీలు, ఇన్ కమ్ టాక్స్ లు కేవలం కాంగ్రెస్ పైనే పనిచేస్తాయా? అని ప్ర‌శ్నించారు.

జరుగుతున్న పరిణామాలను తెలంగాణ సమాజం గమనించాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రసంగాలకు జరుగుతున్న తతంగాలకు పోలిక లేదన్నారు. కాంగ్రెస్ గెలుస్తుందనే టాక్ నేపథ్యంలోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అన్నారు. డబ్బు సంచులతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఓటుకు పదివేలు ఇచ్చి కేసీఆర్ గెలవాలని చూస్తున్నారు.. నగదు బదిలీ పథకం మొదలైందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. జరుగుతున్న పరిణామాలను గమనించి తెలంగాణ ప్రజలు విచక్షణతో ఓటు వేయండని సూచించారు.

Next Story