రాహుల్ గాంధీపై రాజా సింగ్ విమర్శలు
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చెందిన పలు అకౌంట్లను మెటా తొలగించింది.
By Medi Samrat Published on 21 Feb 2025 7:15 PM IST
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చెందిన పలు అకౌంట్లను మెటా తొలగించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల నుంచి రాజా సింగ్ కు చెందిన 2 ఫేస్బుక్ పేజీలు, 3 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను డిలీట్ చేశారు. ఈ చర్యలపై రాజా సింగ్ ‘ఎక్స్’లో స్పందించారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని సెలెక్టివ్ సెన్సార్షిప్ దాడి జరుగుతోందని ఆరోపించారు. తన కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సోషల్ మీడియా ఖాతాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేయడం దురదృష్టకరమన్నారు. రాహుల్ గాంధీ ఫిర్యాదు ఆధారంగా తన అధికారిక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తి చేస్తున్నారంటూ 'ఇండియా హేట్ ల్యాబ్' రాజా సింగ్ పై ఒక నివేదికను ప్రచురించిన రెండు వారాల తర్వాత అకౌంట్లు బ్యాన్ అయ్యాయి. తొలగించిన ఫేస్ బుక్ గ్రూపుల్లో సుమారు 10 లక్షల మందికి పైగా సభ్యులుగా ఉండగా, ఇన్స్టా అకౌంట్లలో లక్షా 55 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.2020లోనే తన ప్లాట్ఫామ్స్ నుంచి రాజాసింగ్పై మెటా నిషేధం విధించింది. అయితే ఆయన మద్దతుదారులు కొత్త మార్గాల ద్వారా గ్రూపులు, పేజీలను సృష్టించారు. వాటిలో ఎప్పటికప్పుడు రాజాసింగ్కు చెందిన ప్రసంగాలు, కార్యాకలాపాలకు సంబంధించిన వివరాలు షేర్ చేస్తున్నారు.