దెబ్బకు దెబ్బ తీస్తాం.. ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో మాకు తెలుసు

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉందని పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  18 March 2024 9:31 AM GMT
దెబ్బకు దెబ్బ తీస్తాం.. ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో మాకు తెలుసు

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉందని పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. 10 యేళ్ళ పాటు విచ్చల విడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా..? కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సీపీఐ ఎమ్మెల్యే లను ప్రలోభ పెట్టి మీ పార్టీ లో చేర్చుకోలేదా..? తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నది మీరు కాదా..? అని ప్ర‌శ్నల వ‌ర్షం కురిపించారు.

పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుందని వివ‌రించారు. 2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యే లను మీరు చేర్చుకున్నారు. ఇందులో టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 5, వైసీపీ నుంచి 3, బీఎస్సీ నుంచి 2, సీపీఐ నుంచి ఒక‌రిని చేర్చుకున్నారని వివ‌రించారు.

2018లో 16 మందిని చేర్చుకోలేదా..? కాంగ్రెస్ నుంచి 12 మంది, తెలుగుదేశం నుంచి 2, ఇండిపెండెంట్లు 2 చేర్చుకున్నార‌న్నారు. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి ప్రలోభపెట్టింది మరిచిపోయారా అని ప్ర‌శ్నించారు. టీడీపీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రి వర్గంలోకి తీసుకోలేదా..? అని నిల‌దీశారు.

కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి ని మీ మంత్రివర్గంలోకి తీసుకోలేదా.. అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్ల లపైన చర్యలు తీసుకున్నారా..? అని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులపైన ఒక్క సారి కూడా కనీసం విచారణ కూడా చేయలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యే లను చేర్చుకోవాలని మా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ భావించలేదన్నారు. 100 రోజుల పాటు మేం ఆ ఆలోచన కూడా చేయలేదన్నారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇచ్చాం. మా ముఖ్యమంత్రి వారికి అపాయింట్ మెంట్ ఇచ్చి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేశాయన్నారు. ప్రమాణస్వీకారానికి ముందే కడియం శ్రీహరి లాంటి సీనియ‌ర్ రాజ‌కాయ నాయ‌కుడు ప్రభుత్వం కూలి పోతుందన్నారు. త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ అనలేదా.? మన ప్రభుత్వం ఆరు నెలల్లో వస్తుందని కేసీఆర్ ఎమ్మెల్యే ల సమావేశంలో చెప్పలేదా..? బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..? మీ కుట్రలకు బలి కావడానికి రేవంత్ రెడ్డి చేతకాని వాడు కాదన్నారు. దెబ్బకు దెబ్బ తీస్తాం.. మా ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో మాకు తెలుసన్నారు.

Next Story