'బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర'.. బాంబ్ పేల్చిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తెస్తే వ్యతిరేకించానని తెలిపారు.
By అంజి
'బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర'.. బాంబ్ పేల్చిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తెస్తే వ్యతిరేకించానని తెలిపారు. తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారని మీడియాతో చిట్చాట్లో భగ్గుమన్నారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమొస్తుందని నిలదీశారు. తాను జైలుకు వెళ్లినప్పుడు పార్టీకి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారని వివరించారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు కేసీఆర్ తప్ప ఇంకెవ్వరు నాయకుడు లేరని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. కేసీఆర్ లా తాను తిక్కదాన్ననని, ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు.
25 ఏళ్ల నుంచి తండ్రికి లేఖలు రాస్తున్నానని, ఆయన చదివి చించేస్తారని చెప్పారు. కానీ ఈ సారి తాను రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందని నిలదీశారు. తనకు ఒక్క విషయం చెప్పాలని, తన లేఖను లీక్ చేసింది ఎవరో బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తనను, కేసీఆర్ను విడదీసేందుకు కుట్ర చేస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కవిత అన్నారు. తనను పార్టీకి దూరం చేస్తే ఎక్కువ లబ్ధి పొందేది ఎవరో అందరికీ తెలుసునని తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వారిని గౌరవిస్తానని, కానీ అమెరికా నుంచి వచ్చేలోగా తనను పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారని కవిత ఆరోపించారు. తన వద్దకు రాయబారానికి వచ్చిన దామోదర్రావు, గండ్ర మోహన్ రావు ఎవరి మనుషులో అందరికీ తెలుసునన్నారు. తాను చిచరో రాజకీయాలు చేయనని, హుందాగా వ్యవహరిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కొందరు తన మీద పడి ఏడ్వడం ఆపాలని ఆమె పేర్కొన్నారు.
హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏవరైనా తన జోలికి వస్తే ఊరుకోనన్నారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలయవని, ముందు ఒకటి వెనుక మరొకటి మాట్లాడనన్నారు. తాను కాంగ్రెస్తో టచ్లో లేక 12 ఏళ్లు అయ్యిందన్నారు. కాంగ్రెస్తో తాను మాట్లాడానన్నది శుద్ధ అబద్ధం అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చేయాల్సిన సగం పనులను జాగృతి తరఫున తాను చేస్తున్నానని కవిత చెప్పారు. తనపై సవ్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులొస్తే ఎవరూ స్పందించలేదని, మరో నేతకు వస్తే ఎందుకు హంగామా చేశారంటూ ఫైర్ అయ్యారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని ఒప్పుకుంటున్నప్పుడు వాళ్లను ఎందుకు పక్కన పెట్టడం లేదని దుయ్యబట్టారు.