కుల గణనపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.. బీఆర్ఎస్పై మంత్రులు ఫైర్
కుల గణన ప్లాప్ చేయాలని కుట్ర చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Medi Samrat Published on 5 Feb 2025 4:43 PM ISTకుల గణన ప్లాప్ చేయాలని కుట్ర చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హక్కులు అడిగితే ఈటల రాజేందర్ ను పార్టీ నుండి గెంటేశారన్నారు. బీఆర్ఎస్ నుండి బీసీ నేత ఈటలను బయటకి ఎందుకు పంపారని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీలో మూడు కీలక పదవులు ఒకరికే ఉంటే అడిగే దమ్ముందా.? అని ప్రశ్నించారు. కుల గణనలో పాల్గొనని వాడికి ఏం నైతికత ఉందని అడుగుతున్నారు.? కుల గణనలో ఏం పోరపాటు జరిగిందో చెప్పండని అడిగారు. బలహీన వర్గాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైందని.. కుట్రదారుల ట్రాప్లో పడకండని ప్రజలకు సూచించారు.. పొరపాట్లు అంటే బాధ్యతగా సరిచేస్తామన్నారు. పదేండ్లలో బీసీలకు ఏం చేశారో చర్చించడానికి రెడీ అన్నారు. అసెంబ్లీకి రమ్మంటారా.? చార్మినార్కు రమ్మంటారా.? బల్కం పేట ఎల్లమ్మ గుడి దగ్గర చర్చ చేద్దామా.? అని సవాల్ విసిరారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే అన్ని హామీలు అమలు చేస్తాం.. మీ గొంతు మా గొంతుకు కలపండి.. కేంద్రంపై నినదిద్దాం అన్నారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రెండు కులాల ప్రతినిధిగా చెప్తున్నా.. కుల గణన ఒక చరిత్ర అన్నారు. బీసీల సంఖ్య పెరుగుతున్నా వారికి సామాజిక న్యాయం జరగడం లేదన్నారు. రాహుల్ ఆలోచనతో కుల గణన చేశాం. స్టేట్మెంట్ పెట్టి డిస్కషన్కి అనుమతించాం.. అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే బీఆర్ఎస్ నేతలు వెళ్లిపోవడంతో బీసీలపై ప్రేమ ఎంత ఉందో అర్థం అవుతోందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీల కోసం ఏమైనా చేశారా? కనీసం రిపోర్ట్ బయట పెట్టారా.? అని ప్రశ్నించారు. కుల గణనపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.. కుల గణన అమలును అడ్డుకుంటే మనకే నష్టం అన్నారు.