కేసీఆర్, హరీష్లు పదేళ్లు ఏపీ కోసమే పనిచేశారు : మంత్రి ఉత్తమ్
బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat
బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ.. జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ , అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచర్ల విరుద్దం అన్నారు. అంతర్రాష్ట్ర జలవిధానానికి కూడా బనకచర్ల విరుద్ధమని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించదని నిర్మల సీతారామన్ కు లేఖద్వారా వివరించామన్నారు.
జనవరి 22న జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ వ్రాసానని తెలిపారు. మాకు ఏపీ నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని.. వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామని.. మే నెలలో తెలంగాణకు పాటిల్ లేఖ వ్రాసారని తెలిపారు. చట్టప్రకారం ముందుకు వెళతామని పాటిల్ మాకు హామీ ఇచ్చారని.. ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా లేఖల్లో సవివరంగా వివరించామని పేర్కొన్నారు.
కేంద్రం చట్ట విరుద్ధంగా ఏపీకి సహకరిస్తుందని అనుకోవడం లేదని.. తెలంగాణకు అన్యాయం జరిగితే.. ఎంత వరకైనా పోరాడుతామన్నారు. తెలంగాణ నీటి హక్కులకోసం రాజీలేని పోరాటం చేస్తాం.. వెనక్కి తగ్గేదేలేదన్నారు. ఈ విషయలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు.
కృష్ణాలో అన్యాయం జరుగుతుంటే పదేళ్లు బీఆర్ఎస్ సహకరించిందని.. ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాటా 724 టీఎంసీలు ఏపీకి వెళితే.. బీఆర్ఎస్ హయాంలో 1254 టీఎంసీలు కృష్ణా నీళ్లు తరలించారన్నారు. కాళేశ్వరంలో జరిగిన వృధా ఖర్చును చేయకుంటే.. కృష్ణా ప్రాజెక్టులు అన్ని పూర్తి అయ్యేవి అన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర కాకుండా.. మేడిగడ్డ వద్ద కట్టడం ద్వారా 68 వేల కోట్లు కాళేశ్వరం అదనపు ఖర్చు అయ్యిందన్నారు. కృష్ణాలో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్నేనన్నారు. 512 టీఎంసీలు ఏపీకి.. తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా..? అప్పుడు మోసం చేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు బీఆర్ఎస్ నేతలు అని మండిపడ్డారు.
ముచ్చుమర్రి ప్రాజెక్ట్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తెలంగాణ మరణశాసనం అన్నారు. ప్రతిరోజూ 3 టీఎంసీ తరలించేందుకు కేసీఆర్ సర్కార్ సహకరించింది నిజం.. జగన్ తో అలైబాలై చేసుకుని.. కృష్ణా నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారన్నారు. పదేళ్లలో కేసీఆర్, హరీష్లు ఏపీ కోసమే పనిచేసారు.. కృష్ణాలో నీటిని తరలించారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీ కంటే ముచ్చుమర్రి, మల్యాలలో పదేళ్ల కేసీఆర్ హయాంలోనే ఎక్కువగా తరలించుకు పోయారని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్ట్ టెండర్లు పూర్తి అయ్యేవరకూ.. తెలంగాణ కావాలనే అపెక్స్ కౌన్సిల్ కు వెళ్ళలేదన్నారు. జగన్-కేసీఆర్ రహస్యం ఒప్పందంలో భాగంగానే..తెలంగాణ అపెక్స్ మీటింగ్ వెళ్ళలేదని ఆరోపించారు.
బనకచర్లపై బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ రావు అని పేరు మార్చుకుంటే సరిపోతుందన్నారు. గోబెల్స్ బతికి వుంటే.. వీళ్లను చూసి ఆశ్చర్యపోయేవారు.. నన్ను మించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆశ్యర్యపోయేవారన్నారు.