బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ ఇచ్చేందుకు మహేశ్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సిట్ అధికారుల ఎదుట హాజరై తన స్టేట్మెంట్ను ఇచ్చారు. అనంతరం మహేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్య. మా కదలికలను మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రాక్ చేశారు. 2022 నుంచి కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది. 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది..అని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయమలో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ కారణం. నక్సలైట్ల సానుభూతిపరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఎలాంటి అధికార హోదా లేని వ్యక్తికి అధికారాన్ని కట్టబెట్టి ఫోన్ల ట్యాప్ చేయించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోతాం అని తెలిసే హార్డ్ డిస్క్లను ప్రభాకర్ రావు ధ్వంసం చేయించాడు. ప్రభాకర్ రావు. అప్పటి చీఫ్ సెక్రటరీ కలిసి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నాయకుల ఫోన్లతో పాటు బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లు ఎంతటి వాళ్లయినా వదిలేది లేదు..అని టీపీసీసీ చీఫ్ హెచ్చరించారు.