రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వీరోచితంగా పోరాటం చేసిన, బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. 2,580 పైచిలుకు వార్డులకు ఎన్నికలు జరిగితే.. సుమారు 750 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో కూడా 30 శాతానికి పైగా సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం 40 శాతానికి పైగా ఓటు బ్యాంకు సాధించామని గుర్తు చేశారు. దాదాపు 35 స్థానాలకు పైగా హంగ్ ఏర్పడిందని, 16 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలిచింది. ఇక వాళ్లు గెలిచింది ఎన్ని అని కేటీఆర్ అడిగారు.
అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ గెలిచిందే తప్ప నిజమైన విజయం కాదన్నారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచిందని ఆరోపించారు. ప్రజల మనసు గెలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. మా విజయంతో కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూతపడ్డాయన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ను ఎదుర్కొంటామన్నారు. బీజేపీని నిలువరించేందుకు సింగరేణి ప్రాంతంలో సీపీఐతో కలిసి పోరాడామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ సింగరేణి గొంతు కోస్తున్నాయని మండిపడ్డారు. సింగరేణిలో జరిగిన అవినీతిని ఆధారాలతో బయటపెడితే బీజేపీ సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతుందో తెలియడం లేదన్నారు.