కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

By Medi Samrat  Published on  13 Dec 2023 9:56 AM GMT
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ చేయడానికి తాము ఎంత కష్టపడ్డామో తమకు మాత్రమే తెలుసని.. అలాంటిది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ గురించి అడ్డగోలు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని గుర్తుచేశారు. ఈ హామీ ఎలా అమలు చేస్తారో తాము కూడా చూస్తామని కేటీఆర్ అన్నారు.

పది రోజుల్లోనే రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పారన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న మంత్రుల వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఆడిట్ రిపోర్టులు మీడియాకు రిలీజ్ చేసిందని.. ఆయా శాఖలకు సంబంధించిన కాగ్, ఇతరత్రా ఆడిట్ రిపోర్టులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచామని చెప్పారు. ఆడిట్ రిపోర్టులు శ్వేతపత్రం కాకుంటే మరేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన కాగ్ రిపోర్టులను, ఆడిట్ నివేదికలను పరిశీలించి దానికి అనుగుణంగా హామీలు ఇవ్వాలని ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు లెక్కలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story