తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు జవాబు చెప్పాలా? అని ప్రశ్నించారు. సీఎం గాలి మాటలకు, సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆ ఆరోపణలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారు..అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ కు చెంపపెట్టులాంటి జవాబిచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాతీర్పును గౌరవించి ఇకనైనా ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలంటూ రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
ప్రజా తీర్పు.. కాంగ్రెస్ పాలనకు చెంప పెట్టులాంటిది. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి. రైతులకు ఎకరాకు రూ.15 వేలు, యువతకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి..అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.