తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 4013 ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావు అండ్ టీమ్ ట్యాప్ చేసినట్లు ఐడెంటిఫై చేశారు. వీరిలో 618 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు నిర్ధారించారు. 618 మందిలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ , పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు, రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు.
ఇక త్వరలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, తాటికొండ రాజయ్యలకు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. అటు ఐఏఎస్ అధికారులు రోనాల్డ్ రోస్, గౌతమ్ల ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. మొత్తం 618 మంది స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. కాగా ఇప్పటివరకు 228 మంది వాంగ్మూలాలను సిట్ అధికారులు పూర్తి చేశారు.