కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు.. కేటీఆర్ బిగ్ అప్డేట్
కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By - Medi Samrat |
కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ రేపు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారని, కేసీఆర్ బహిరంగ సమావేశాలపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిందని ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్బాల్ ఆడుకుంటారో తనకు తెలియదని, కానీ తాను మాత్రం ఆయనతో ఫుట్బాల్ ఆడుకుంటానని కేటీఆర్ అన్నారు. తాను ఫెయిల్యూర్ నాయకుడిని కాదని, తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్లు, 136 మున్సిపాలిటీలను గెలిచామన్నారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 7 ఉప ఎన్నికలు నిర్వహిస్తే అన్ని స్థానాల్లో ఓడిపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సొంత పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపించలేకపోయారని విమర్శించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో రేవంత్ రెడ్డి ఇల్లును రీమోడల్ చేయించిందే బీజేపీ ఎంపీ అని, సీఎం రమేశ్కు కాంట్రాక్టులు ఇస్తుంది రేవంత్ రెడ్డేనని అన్నారు. తాను ముఖ్యమంత్రి ఇంట్లోని మహిళలు, పిల్లలు, మనవడి గురించి మాట్లాడనని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి లాగా తాను కుటుంబ సభ్యుల గురించి మాట్లాడి చిల్లర రాజకీయాలు చేయదలుచుకోలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.