బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆమె పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇలా రాసుకొచ్చారు.. "ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పటి వరకు 95 మంది విద్యార్థుల ప్రాణాలను కాంగ్రెస్ సర్కారు బలి తీసుకున్నది. విద్యార్థులపై దయలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయక పోవడం విచారకరం. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ పేరుతో ఒక్క ఇటుక కూడా పేర్చని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. అందులో కొంత అయిన విద్యార్థులకు మంచి చేయడానికి పెడితే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. విద్యాశాఖను స్వయంగా చూస్తున్న ముఖ్యమంత్రి ఇకనైనా విద్యార్థుల మరణాలను అరికట్టేందుకు ప్రయత్నించాలి" అని కవిత తన ట్వీట్ లో రాసుకొచ్చారు.