తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్..ఆ కేసులు కొట్టివేత

తనపై నమోదైన కేసుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ లభించింది.

By Knakam Karthik
Published on : 21 April 2025 3:50 PM IST

Telangana, Brs, Ktr, Congress Government, TG High Court, dismisses case

తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్..ఆ కేసులు కొట్టివేత

తనపై నమోదైన కేసుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ లభించింది. నిర్మల్ జిల్లా ఉట్నూర్ పీఎస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. రూ.లక్షన్నర కోట్లతో చేపడుతోన్న మూసీ ప్రాజెక్ట్ దేశంలో అతిపెద్ద కుంభకోణం అంటూ ఉట్నూర్‌లో జరిగిన ఓ సభలో కేటీఆర్ ప్రస్తావించారు. దేశంలో రాబోయే ఎన్నికల కోసం కావలసిన నిధులను కాంగ్రెస్‌ మూసీ ప్రాజెక్టును రిజర్వ్‌ బ్యాంక్‌లా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా కేటీఆర్‌ మాట్లాడారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఉట్నూరు పోలీసులు కేటీఆర్‌పై BNS సెక్షన్లు 352, 353(2), 356(2) కింద కేసు నమోదు చేశారు.

ఇక మరో కేసులోనూ కేటీఆర్‌కు ఊరట దక్కింది. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగురవేశారని కేటీఆర్‌తో పాటు మరికొంతమందిపై కేసు నమోదు అయింది. ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు మహదేవపూర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ సందర్భంగా సందర్భంగా కేటీఆర్ తరపున న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపించారు. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారు..అని కోర్టులో వాదించారు. అటు ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ.. డ్రోన్ ఎగురవేయడం డ్యామ్ భద్రతకే ప్రమాదమని కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్‌పై పోలీసులు దాఖలు చేసిన కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

Next Story