తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందట. ముఖ్యంగా వచ్చే రెండు రోజుల్లో ఎండల తీవ్రత గణనీయంగా పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రాత్రి సమయాల్లో కూడా ఉక్కపోత, వేడి వాతావరణం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారే అవకాశం ఉందని, శుక్రవారం, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడి ఉండొచ్చని వాతావరణ విభాగం అంచనా వేసింది.