కేంద్ర మంత్రులను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం.. ఎందుకంటే..?
కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం గురువారం కేంద్రమంత్రులను కలిసి పలు విజ్ఞప్తులు చేసింది.
By Medi Samrat Published on 6 Feb 2025 2:43 PM ISTకేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం గురువారం కేంద్రమంత్రులను కలిసి పలు విజ్ఞప్తులు చేసింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం జాతీయ రహదారి 368B సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు ప్రపోజల్ను వేములవాడ నుండి కోరుట్ల వరకు విస్తరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. ఈ రహదారి విస్తరణ వల్ల ఈ రహదారి వెంబడి ఉన్న తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు – వేములవాడ, కొండగట్టు, ధర్మపురి – మరింత అనుసంధానమవుతాయి. అలాగే, నేషనల్ హైవే 63కి అనుసంధానం కలుగుతుందని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ఈ ప్రతిపాదనలు చేసినట్లు గుర్తుచేశారు. మానేరు నదిపై రోడ్డు-కమ్-రైల్ బ్రిడ్జి నిర్మించాలని కేటీఆర్ బృందం గడ్కరీని కోరింది. ఈ ప్రతిపాదనలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని బీఆర్ఎస్ ప్రతినిధులు కేంద్ర మంత్రికి తెలియజేశారు.
మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, యూజీసీ నిబంధనలు సవరించి న్యాయం చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కలిసి బీఆర్ఎస్ నేతల బృదం వినతి పత్రం అందించింది. కేటీఆర్ వెంట కేంద్రమంత్రులను కలిసిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి తదితరులు ఉన్నారు.