మోదీ, రాహుల్ తలచుకుంటే బీసీ బిల్లు సాధ్యమే: మాజీ ఎంపీ

జీవో, ఆర్డినెన్స్‌ల ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు..అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 30 July 2025 12:19 PM IST

Telangana, Ex Mp Vinodkumar, Bc Reservations, Congress, Brs, Bjp

మోదీ, రాహుల్ తలచుకుంటే బీసీ బిల్లు సాధ్యమే: మాజీ ఎంపీ

జీవో, ఆర్డినెన్స్‌ల ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు..అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..మోడీ, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే గంటలో బీసీ రిజర్వేషన్లు బిల్లు సాధ్యమే. మోదీకి చిత్తశుద్ధి లేదు, రాహుల్ గాంధీ అడగరు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఈ లోపే ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరగవా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఒకే అంశం మీద బీసీ బిల్లు ,ఆర్డినెన్స్ ఉన్నపుడు ఆర్డినెన్స్ ఎపుడూ ఆమోదానికి నోచుకోదని మాకు ముందే తెలుసు. కాంగ్రెస్, బీజేపీ బీసీలను ఎందుకు మోసం చేయాలని చూస్తున్నాయి. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని ఇందిరా సహానీ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు..అని వినోద్ కుమార్ అన్నారు.

రాహుల్ గాంధీ ప్రతిపక్షనాయకుడిగా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రైవేట్ బిల్లును ప్రవేశ పెడితే చర్చ జరుగుతుంది. బీజేపీ కొత్త అధ్యక్షుడు రాంచందర్ రావు తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా చేస్తామంటున్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచని వారు బీసీని సీఎం చేస్తారా? రాజ్యాంగం 243 (డి) కి సవరణ చేస్తే బీసీల రిజర్వేషన్లు పెంచవచ్చు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయవచ్చు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీతో మాట్లాడి మోదీపై ఒత్తిడి పెంచవచ్చు. ధర్నాలు డ్రామాలు కాదు ..రాహుల్‌ను వెంట తీసుకుని రేవంత్ ప్రధాని మోదీ దగ్గరకు వెళ్ళాలి. కేసీఆర్ హయంలో పంపిన తీర్మానంతో రేవంత్ రెడ్డి పంపిన బిల్లును కలిపి పార్లమెంటు ఆమోదించాలి. అడ్వొకేట్ జనరల్ పదవిని బీసీలకు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే. చిత్తశుద్ధి ఉంటే చట్టాలతో పని లేదని కేసీఆర్ నిరూపించారు. మోదీ ,రాహుల్ గాంధీ తలచుకుంటే పార్లమెంట్‌లో ఏ బిల్లునైనా ఆమోదించవచ్చు..అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.

Next Story