బనకచర్ల వివాదంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టు కంటే ముందు హంద్రీనీవా, వంశిధర లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అభ్యంతరాలు లేకుండా ప్రాజెక్టులను కట్టుకుంటే మంచిదన్నారు.
కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు.. రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నామని అన్నారు. వెనకబడిన ప్రాంతాలకు నీరు అందే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం సహాయం తీసుకోవాలన్నారు. కొంతమంది ప్రాంతీయ ధోరణితో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి.. తెలుగు వాళ్ళు, తెలుగు వాళ్ళు శత్రువులు కాదు.. ఎవరికీ నష్టం లేని పద్ధతిలో సమస్యను పరిష్కారం చేసుకుంటే మంచిదని సూచించారు.