కేటీఆర్‌కు బుడ్లు, బెడ్లు, దుడ్లు తప్ప ఏమీ తెలియదు : పొన్నం ప్రభాకర్

Congress Ex MP Ponnam Prabhakar Fire On BRS. 2004, 2009లో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ ఆ ప‌ద‌విని చేప‌ట్ట‌లేద‌ని

By Medi Samrat  Published on  17 July 2023 9:03 AM GMT
కేటీఆర్‌కు బుడ్లు, బెడ్లు, దుడ్లు తప్ప ఏమీ తెలియదు : పొన్నం ప్రభాకర్

2004, 2009లో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ ఆ ప‌ద‌విని చేప‌ట్ట‌లేద‌ని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లాకు ఇరిగేషన్ పరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదని అన్నారు. కేటీఆర్ కు వ్యవసాయం గురించి ఏమి తెలుసని మాట్లాడుతున్నారు.. కేటీఆర్ కు బుడ్లు, బెడ్లు, దుడ్లు తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అని తెలియ‌జేశారు. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని చూసి బీఆర్ఎస్‌ నేతలు భయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై మాటల దాడి చేసేందుకు బీఆర్ఎస్‌, బీజేపీ కలిసి నిర్ణయం తీసుకున్నాయని ఆరోపించారు.

రైతు వేదికల ద్వారా రైతు రుణ మాఫీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని సూచించారు. తెలంగాణలో డ్రిప్ ఇరిగేషన్ లేకుండా పోయిందని.. మూడు పంటలు పండటానికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. వ్యవసాయం దండగ అన్న స్థితి నుండి.. వ్యవసాయం పండుగ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని తెలిపారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ఘనత అని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక విద్యుత్ ఉత్పాదన ఎక్కడ పెరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సబ్ స్టేషన్స్ వద్ద లాగ్ బుక్స్ ఎందుకు దాచి పెడుతున్నారని ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి లిక్కర్ మీద వున్న శ్రద్ధ వ్యవసాయం మీద లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క చెరువును తవ్వలేదని విమ‌ర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలయజ్ఞంకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణలో 36 నీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. రైతు వేదికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీ లక్ష రూపాయల రుణమాఫీ.. అమలు జరిగిందా లేదా అని రైతులు ప్రశ్నించాలని.. బీఆర్ఎస్ హయాంలో మార్క్ ఫెడ్ రైతులకు ఉపయోగపడటం లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు విత్తనాలు ఇవ్వడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Next Story