హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అండతోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీల సమాఖ్య జాతీయ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ..స్వాతంత్ర్య పోరాటంలో భాగం లేని వాళ్ళు.. ఈరోజు దేశాన్ని ఏలుతున్న వాళ్లు.. మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మతతత్వ శక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనమందరం ఐక్యంగా ఉండాలి...అని పేర్కొన్నారు.
రాజ్యాంగం స్థానంలో మనస్మృతిని అమలు చేయాలని కుట్రలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ ఆశయమైన.. ఎవరు ఎంతో వారికంతా వాటా నినాదాన్ని సఫలం చేసిన ఘనుడు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు చట్టాలను తీసుకొచ్చి దేశానికి రోల్ మోడల్ గా నిలిచాం. దేశ రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మతవాద శక్తులను అడ్డుకోవాలి..అని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.