పనులు చేయడమే కాదు, రాజకీయాల్లో చేసింది చెప్పుకోవాలి: సీఎం రేవంత్
దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిది..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By - Knakam Karthik |
పనులు చేయడమే కాదు, రాజకీయాల్లో చేసింది చెప్పుకోవాలి: సీఎం రేవంత్
హైదరాబాద్: దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిది..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం మాట్లాడుతూ..దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలు అర్పించింది. సొంత ఆస్తులతో నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రారంభించి దేశ స్వాతంత్ర్యంలో గాంధీ కుటుంబం కీలకపాత్ర పోషించింది. నేషనల్ హెరాల్డ్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థికంగా నిలబడేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కృషి చేశారు. తిరిగి పత్రికను పునరుద్ధరించడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అవసరమైంది. అందుకే మల్లికార్జున ఖర్గే లాంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులను బోర్డు డైరెక్టర్లుగా నియమించి పత్రికను పునరుద్ధరించింది . ఇందులో ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధం లేదు . నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పత్రికను నడిపారు . దీన్ని మనీ ల్యాండరింగ్ కేసు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను వేధిస్తున్నారు . ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లారు . ఆ విషయాన్ని దృష్టి మరల్చేందుకు మళ్లీ కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారు . సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేస్తున్నాం . సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అండగా నిలబడతామని, అవసరమైతే ఎందాకైనా పోరాడతామని సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వదలచుకున్నాం..అని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మనం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోటి మందికి కోటి చీరలను ఆడబిడ్డలకు సారెగా అందిస్తున్నాం. ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదే. గ్రామలవారీగా సమన్వయం చేసుకుంటూ పంపిణీ పూర్తి చేయాలి. డిసెంబర్ లోగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ పూర్తయ్యేలా చూడాలి. మార్చి నెలలో పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 35 లక్షల చీరలను పంపిణీ చేయాలి. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, పరిపాలనపై గ్రామ గ్రామాన చర్చ పెట్టండి. సంక్షోభంలో మనకు రాష్ట్రాన్ని అప్పగిస్తే… సంక్షోభం నుంచి సంక్షేమం వైపు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం. 2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ నెల 7 న ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెట్టి యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ యూనివర్సిటీగా తీర్చి దిద్దుతాం..అని సీఎం తెలిపారు.
8,9 న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించుకోబోతున్నాం. కోర్ అర్బన్ లో సమస్యలను దృష్టిలో పెట్టుకుని CURE చేయాలని నిర్ణయించుకున్నాం . కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ బయటకు తరలిస్తాం. రీజనల్ రింగ్ లోపల ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) ప్రాంతంలో పరిశ్రమలకు ఏర్పాటు చేసుకోబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్ బయట రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ ( RARE) ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోబోతున్నాం . తెలంగాణలో మరో నాలుగు విమానాశ్రయాలు, ఒక డ్రై పోర్టు ఏర్పాటు చేసుకోబోతున్నాం . కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్ బెంగుళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నాం . పనులు చేయడమే కాదు… రాజకీయాల్లో చేసింది చెప్పుకోవాలి. మనం చేస్తున్న పనులు, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించండి. రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. జిల్లా అధ్యక్షుడు అనేది గొప్ప బాధ్యత. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. రాజకీయాల్లో కాళ్లలో కట్టెలు పెట్టడం సహజం.. అది పెద్ద సమస్యగా భావించొద్దు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి..అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.