పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు, చేతిలో చిప్ప పెట్టారు: సీఎం రేవంత్

రైతుల ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik
Published on : 16 Jun 2025 8:31 PM IST

Telangana, Cm Revanthreddy, Congress Government, Brs

పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు, చేతిలో చిప్ప పెట్టారు: సీఎం రేవంత్

రైతుల ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి ప్రోగ్రాంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్న రైతులు అండగా ఉంటేనే సాధ్యం. గతంలో పదవులు అనుభవించిన వాళ్లు, పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనివారు వీధి వీధినా నాటకాలకు బయలుదేరారు. పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు, చేతిలో చిప్ప పెట్టారు. వాళ్లు పదేళ్లలో చేసిన విధ్వంసం వందేళ్లయినా కోలుకోలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్ధిక వ్యవస్థగా మార్చి మనకు అప్పగించారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించారు..అని సీఎం విమర్శించారు.

ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం..వరి వేయండి చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం. పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు రైతులను సన్న వడ్లు పండించేందుకు ప్రోత్సహించాం. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించి రాష్ట్రంలో 60 శాతం సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించాం. మీరు సన్న వడ్లు పండించడం వల్లే ఇవాళ పేదలకు సన్నంబియ్యం అందించగలుగుతున్నాం. వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి. పదేళ్లలో 8 లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. అప్పులు మన నెత్తిపై పెట్టి ఇవాళ మనల్ని విమర్శలు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ… ముందుకు వెళుతున్నాం.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించేందుకు సిద్ధమయ్యాం..అని సీఎం పేర్కొన్నారు.

Next Story