తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదు : సీఎం
తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By - Medi Samrat |
తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయయని పదేళ్లు తానే సీఎంగా ఉంటానన్నారు. 2027 మే లేదా జూన్ నాటికి జనాభా లెక్కలు తేలుతాయని.. 2028 నాటికి మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతాయన్నారు. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంలో ఓటుకు నోటు ఆధారాలు తగలబడ్డాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అసలు ఎనాలసిస్ అయిన తర్వాత అక్కడ ఆధారాలు ఉండవన్నారు.
ఎన్టీఆర్ జాతి ఆస్తి, ఆయన నేషనల్ లీడర్.. ఆయన ఎవరో ఒకరి సొత్తు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు.
మార్చి 31 లోపు హైద్రాబాద్ మోట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసే ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. జూన్ 2న ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. సింగరేణిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజు చర్చ జరిపి అన్ని విషయాలు మాట్లాడతానన్నారు. వాస్తవాలు చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి తాను మాట్లాడింది తప్పు అని గ్రహించి క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ స్వయం ప్రకటిత గృహ దిగ్బంధంలో ఉన్నారన్నారు. నేను ఎవరి ఫోన్లు ట్యాప్ చెయ్యడం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతరుల విషయాలు వినడం మానసిక క్షోభ అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది.. కృష్ణ, గోదావరి బేసిన్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పు లేదన్నారు. తెలంగాణ తన ప్రాజెక్టులు పూర్తి చేస్తే వరద జలాల లెక్కలు తేలుతాయన్నారు. నికర జలాల లెక్కల ప్రకారం.. తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పకూడదన్నారు. గోదావరి, కృష్ణానదీ బేసిన్లలో ప్రాజెక్టులు నిర్మించే విషయంలో ఒకే విధానం ఉండాలన్నారు.
మహబూబ్ నగర్లో ఒక కౌన్సిలర్ కోసం హత్యా రాజకీయాలు చేయ్యాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీకి అనుమానాలు ఉంటే సీబీఐతో విచారణ చేయించుకోవాలన్నారు. అధిష్టానంతో సమావేశంలో కేబినెట్ విస్తరణ ప్రస్తావన రాలేదన్నారు.