తెలంగాణను సంప్రదించకపోవడమే వివాదానికి కారణం : సీఎం రేవంత్

గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు విష‌యంలో ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat
Published on : 20 Jun 2025 8:27 PM IST

తెలంగాణను సంప్రదించకపోవడమే వివాదానికి కారణం : సీఎం రేవంత్

గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు విష‌యంలో ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తాము ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదని.. అయితే తెలంగాణ హక్కులను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం తొలుత తెలంగాణను సంప్రదించకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక సాధ్యసాధ్యాల నివేదిక (పీఎఫ్ఆర్) సమర్పించడమే ప్రస్తుత వివాదానికి మూలకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే మాతో చర్చించి ఉంటే ఈ వివాదం ఉండేది కాదు.. కేంద్రానికి ఏపీ నివేదిక ఇవ్వగానే, కేంద్రం కూడా అన్ని రకాల చర్యలకు సిద్ధమవుతోందని అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు తమకు ఎలాంటి బేషజాలు లేవని, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై మాట్లాడుకుందామని ఆయన సూచించారు. ఒక రోజు కాదు, అవసరమైతే నాలుగు రోజులైనా చర్చిద్దాం.. రాష్ట్రాల మధ్య జలవివాదాలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయన్నారు.

ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుందని.. ఈ భేటీలో బనకచర్ల అంశంపై సమగ్రంగా చర్చించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ను అధికారికంగా చర్చలకు ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. "ఒక అడుగు ముందుకేసి మేమే ఏపీని చర్చలకు పిలుస్తాం.. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దు. పైన, కింద ఉన్న రాష్ట్రాలతో వివాదం కోరుకోవట్లేదని ఆయన అన్నారు. విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించుకునేందుకు ఇప్పటికే అధికారులు, మంత్రుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేసిందని ఆరోపించారు. నీళ్లు, నిధుల పేరిట బీఆర్ఎస్ నేతలు మోసపూరిత సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకున్నారు. రాయలసీమను రత్నాలసీమ చేస్తానని కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలను ఏపీ ఉపయోగించుకుంటే తప్పేంటని కూడా గతంలో వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను ఏపీకి రాసిచ్చింది కేసీఆర్, హరీశ్ రావులే" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను కృష్ణా జలాల్లో 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీ అడిగితే మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుపడుతున్నారని, ఆయన వాదనలో పసలేదని అన్నారు. 2023లో కేంద్రానికి హరీశ్ రావు రాసిన లేఖలో కేవలం 405 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు అడిగారని గుర్తుచేశారు. విభజన చట్టంలో పోలవరానికి మాత్రమే అనుమతి ఉంది. బనకచర్ల అనేది పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు. దీనిపై తెలంగాణ అభిప్రాయం తప్పక తీసుకోవాల్సిందే. గోదావరిలో 968 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు తెలంగాణకు ఉంది. కానీ, కేటాయించిన నీటిని వాడుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడంతోనే వివాదాలు తలెత్తుతున్నాయి" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాద పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని స్పష్టం చేశారు. అలాగే.. జూలై 6, 7 తేదీల్లో మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.

Next Story