పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వ లేకపోతున్నారు : సీఎం రేవంత్

వనపర్తితో నాకు అనుబంధం ఉంది.. వనపర్తి నాకు చదువుతో పాటు సంస్కారాన్ని ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  2 March 2025 7:12 PM IST
పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వ లేకపోతున్నారు : సీఎం రేవంత్

వనపర్తితో నాకు అనుబంధం ఉంది.. వనపర్తి నాకు చదువుతో పాటు సంస్కారాన్ని ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి బహిరంగ సభలో ఆయ‌న మాట్లాడుతూ.. వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్న.. రాజకీయాల్లో నేను రాణించడంలో వనపర్తి పాత్ర ఉంది.. వనపర్తి ప్రాంతంతో ఎన్నటికీ తెగిపోని బంధం నాది.. వనపర్తి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాన‌ని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వనపర్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐదేళ్ల క్రితం వనపర్తిలో గెలిచిన ఎమ్మెల్యే రాజకీయాలను కలుషితం చేశారని విమ‌ర్శించారు. వనపర్తిలో అనేక విద్యాసంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వాలే పునాది వేశాయి.. వనపర్తిలో నేను నేర్చుకున్న రాజకీయ చైతన్యంతోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాన‌న్నారు.

25 లక్షల 50 వేల రైతులకు 22 వేల కోట్ల రుణమాఫీ జరిగిందా లేదా గుండెలపై చేయి వేసుకొని చెప్పాలి.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.. మా ప్రభుత్వం ఏర్పడగానే 7,625 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేశాం.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 16 వేల మెగావాట్లకు పైగా పెరిగినా ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా చూస్తున్నాం.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. మహిళలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. యాభై లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. యాభై లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.. బీఆర్ఎస్, బీజేపీ వాళ్లకు ఆడబిడ్డలు చలాకీ కాల్చి వాత పెట్టాలి.. బీఆర్ఎస్, బీజేపీ వాళ్లకు ఆడబిడ్డలు గుణపాఠం చెప్పాలన్నారు.

150 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారు.. దాని కోసం 4500 కోట్ల రూపాయలు చెల్లించాం.. స్వయం సహాయక సంఘాలను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.. సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేదు.. వనపర్తి సాక్షిగా ఈ రోజు 1000 కోట్ల రూపాయల రుణాలను ఆడబిడ్డలకు ఇచ్చాం.. రాష్ట్రంలో 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. స్వయం సహాయక సంఘాలను ఆదుకునే బాధ్యత నాదేన‌ని భ‌రోసా ఇచ్చారు.

హైటెక్ సిటీ శిల్పారామం పక్కనే స్వయం సహాయక మహిళల కోసం 150 స్టాల్స్ ఏర్పాటు చేశాం.. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థల పక్కనే మహిళా సంఘాలకు మూడున్నర ఎకరాల స్థలం ఇస్తారని ఎప్పుడైనా ఊహించారా..? అదానీ, అంబానీ లే కాదు స్వయం సహాయక మహిళలు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నాం.. 1000 బస్సులను స్వయం సహాయక మహిళలతో కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చేశాం.. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు బట్టలు కుట్టే పనిని స్వయం సహాయక మహిళలకు కల్పించాం.. ప్రభుత్వ పాఠశాలను నిర్వహించే బాధ్యత ను స్వయం సహాయక సంఘాలకు మహిళలకు ఇచ్చాం.. రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతో ఇస్తున్నామ‌న్నారు,

తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు క్రియాశీలకంగా పనిచేశారు.. 10 యేళ్లలో కేసీఆర్ నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కాని ఆయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి.. ఇందిరమ్మ రాజ్యం లో మొదటి ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలు ఇచ్చాం.. ప్రభుత్వం వచ్చిన యేడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి.. 22 వేల టీచర్లకు ప్రమోషన్లు, 35 వేల టీచర్లకు బదిలీలు చేసి వారి సమస్యలు పరిష్కరించాం.. పదేళ్ల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుని ప్రజల గురించి ఆలోచించలేదు.. పదేళ్లలో ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ప్రజలు ఎందుకు వలస పోతున్నారు.. వలసలు పోతున్న పాలమూరు ప్రజల గురించి కేసీఆర్ ఏనాడైనా ఆలోచన చేశారా..? పదేళ్లలో పాలమూరును ఎందుకు పూర్తి చేయలేదు.. బీమా, కల్వకుర్తి, నెట్టంపాడు ఎందుకు పూర్తి చేయలేదు..? .ఆర్డీఎస్ ఎందుకు ఎండిపోయింది..? ఎస్ఎల్ బీసీ పదేళ్ల పాటు పడాగ పెట్టడంతో కుప్పకూలిపోయింది.. ఈ పాపం కేసీఆర్ ది కాదా..? ఆంధ్రావాళ్లు రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి కుంటు కేసీఆర్ చూడలేదా..? ప్రగతి భనవ్ కు జగన్ ను పిలిచి పంచభక్ష పరమాన్నం పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాది రాయి వేసింది కేసీఆర్ కాదా..? రోజమ్మ ఇంటికి పోయి రొయ్యల పులుసు తిని రాయలసీమ రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అనలేదా..?.మహబూబ్ నగర్ ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకొని ఎంపీగా గెలిపించుకుంటే కేసీఆర్ ఏం చేశావు..? పాలమూరు ద్రోహి కేసీఆర్.. కృష్ణా జలాలు ఆంధ్రా తరలించుకు పోతున్నారంటే దానికి కారణం కేసీఆర్ దుర్మార్గం వల్లనే.. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణ కు అన్యాయం జరిగేలా సంతకం పెట్టిన దుర్మార్గుడు కేసీఆర్.. ఆ సంతకమే తెలంగాణకు యమపాశంగా మారిందని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పాలమూరు రుణం తీర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాను.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి యేడాది కాకముందే మమ్మల్ని దిగిపోమని బీఆర్ఎస్ సన్నాసులు అంటున్నారు.. పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు.. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వ లేకపోతున్నారు.. మా పాలమూరు బిడ్డలకు పరిపాలించే శక్తి లేదా..? పాలమూరు వాళ్లది అమాయకత్వం కాదు మంచితనం.. తిక్క రేగితే డొక్క చీల్చి డోలు కడతం జాగ్రత్త అంటూ హెచ్చ‌రించారు.

Next Story