నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు

మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే.. వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు.. చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

By Medi Samrat
Published on : 27 March 2025 4:42 PM IST

నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు

మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే.. వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు.. చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభలో కేటీఆర్‌కు ముఖ్యమంత్రి కౌంటర్ ఇస్తూ.. డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారని.. 16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదన్నారు.

లైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారన్నారు. కరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు.. వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నా.. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడన్నారు. చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారని.. రాజకీయ కక్ష సాధింపులంటే మీవి క‌దా.. అయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు.

నిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారన్నారు. కానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించాం.. ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించాన‌న్నారు. సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా.. చెంపలు వాయించే శక్తి ఉన్నా.. నేను సంయమనం పాటించా.. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోందన్నారు.

Next Story